Congress: కాంగ్రెస్లో చేరిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి.. పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
దివంగత పీజేఆర్ (p janardhan reddy) కుమార్తె విజయారెడ్డి (vijaya reddy) ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్నారు. గురువారం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ (tpcc) రేవంత్ రెడ్డి (revanth reddy) సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం (congress) పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువవా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. పెన్షన్, రేషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితి నెలకొందని విజయారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రజలను పట్టించుకోవడం లేదని.. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న కాంగ్రెస్కు అండగా వుంటామని విజయారెడ్డి స్పష్టం చేశారు.
కాగా.. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న విజయా రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆమె కొద్దిరోజుల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అంతేకాకుండా అగ్నిపథ్ అంశంలో (agnipath) రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా విజయారెడ్డి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్గా విజయారెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఆశించారని.. అది దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఈ క్రమంలోనే పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని విజయారెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.