గ్రేటర్ ఎన్నికల ప్రచారం... బిజెపి ఎంపి తేజస్వి సూర్యపై పోలీస్ కేసు
తెలంగాణలో జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించిన బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యపై పోలీస్ కేసు నమోదయ్యింది.
హైదరాబాద్: కర్ణాటక రాజధాని బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య పై హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎలాంటి అనుమతులు లేకుండా క్యాంపస్లోకి ప్రవేశించాడని ఓయూ రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ప్రవేశిండమే కాదు సభ కూడా నిర్వహించారంటు ఫిర్యాదులో పేర్కొన్నారు. రిజిస్టర్ ఫిర్యాదుతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు రోజుల పాటు హైదరాబాద్ లో బిజెపికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య. ఇందులోభాగంగా అతడు మంగళవారం ఉస్మానియా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకొంది. తేజస్వి సూర్యతో పాటు బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లేందుకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య వెళ్లేందుకు ప్రయత్నించగా ఎన్సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. గేటును తోసుకొని బీజేవైఎం కార్యకర్తలతో కలిసి తేజస్వి సూర్య క్యాంపస్ లోకి వెళ్లాడు.
క్యాంపస్ లోకి ప్రవేశించిన తర్వాత కాలిబాటన ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ విద్యార్థులను, తెలంగాణ అమరవీరులను ఉద్దేశిస్తూ తేజస్వి మాట్లాడారు. దీంతో అతడిపై పోలీస్ కేసు నమోదయ్యింది.