దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేవారి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం కుదించింది. తొలుత 20 మందికి పైగా నేతలకు ఆహ్వానించినట్టుగా వార్తలు వినిపించినప్పటికీ.. ఈ సమావేశంలో పాల్గొనేవారి సంఖ్యను 15 మందికి పరిమితం చేశారు.
ఆ జాబితాను పరిశీలిస్తే.. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్ల పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమావేశానికి రావాల్సిందిగా సీనియర్ నేత వీ హనుమంతరావుకు కూడా ఆహ్వానం అందింది.
అయితే స్ట్రాటజీ కమిటీకి తమకు ఆహ్వానం అందకపోవడంపై కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్కు ఆహ్వానం అందని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అలకబూనినట్టుగా సమాచారం.
ఈ సమావేశంలో పార్టీ నేతల మధ్య సమన్వయంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలతో ఖర్గే, రాహుల్, ప్రియాంకలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. కాంగ్రెస్ ప్రజలకు అందించే హామీలపై కూడా ఈ బేటీలో చర్చించనున్నట్టుగా సమాచారం. కర్ణాటక తరహాలోనే తెలంగాణ ప్రజలకు ఐదు హామీలను అందించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
