సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించినా.. ఎక్కడోచోట ఆన్లైన్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఇద్దరూ వ్యక్తుల నుంచి రూ 87 లక్షలను కాజేశారు సైబర్ మోసగాళ్లు.
టెక్నాలజీ అనేది దినచర్యలో భాగమైంది. దీని వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో .. అంతకు రెట్టింపు నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో.. సైబర్ స్టాకింగ్, సైబర్ దోపిడి, సైబర్ బెదిరింపు, సైబర్సెక్స్ ట్రాఫికింగ్ వంటి అనేక మోసాలు జరుగుతున్నాయి. ఇదొక మయ ప్రపంచం. అందుకే క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలనీ, కచ్చితంగా ఆన్లైన్ మోసాలు, నేరాలు, వేధింపులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకపోతే జీవితాలు ప్రమాదంలో పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు. అయినా ఎక్కడో ఓ చోట ఆన్లైన్ మోసాలు వెలుగులోకి వస్తునే ఉంటున్నాయి.
తాజాగా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశ చూపిస్తూ.. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.87లక్షలను కాజేశారు సైబర్ మోసగాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్మాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్లో రాండీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనని తాను ఆస్ట్రేలియా కంపెనీ హైపర్వర్త్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు.
తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే.. అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అతడి నుంచి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టించాడు. మొదట్లో లాభాలు ఇస్తూ నమ్మకం కలిగేలా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఎక్కువ డబ్బులు పెట్టుబడిగా పెట్టుబడి పెడితే.. ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని నమ్మబలికాడు. దీంతో ఆ బాధితుడు ఏకంగా రూ.50లక్షలకు ఒక్కసారిగా పెట్టుబడి పెట్టాడు.
ఇదే సమయంలో మరో బాధితుడికి మయాంక్ అనే వ్యక్తి పరిచయమ్యాడు. ఆ వ్యక్తికి కూడా ఇదే తరహాలో లాభాలను చూపించాడు. అతడిని కూడా నమ్మించి.. రూ.12 లక్షలను పెట్టుబడిగా పెట్టించుకున్నాడు. వారు పెట్టుబడి పెట్టిన మరుక్షణం నుంచి ఇటు రాండీ గానీ, అటు మయాంక్ గానీ స్పందించడం మానివేశారు. దీంతో తాము మోసపోయానని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
