ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడి బలి..!
ఆన్లైన్ లోన్ వేధింపులు తాళలేక.. డిగ్రీ విద్యార్థి పవన్కల్యాణ్(24) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆన్ లైన్ లోన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యతో ఈ వ్యవహారం వెలుగులోకిరాగా.. తాజాగా.. ఈ లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకున్న కారణంగా మరో యువకుడు బలి అయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం గాలిపల్లిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ లోన్ వేధింపులు తాళలేక.. డిగ్రీ విద్యార్థి పవన్కల్యాణ్(24) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ యువకుడి మరణంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ విషయంలో మరిని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.లోన్ యాప్ ద్వారా వడ్డీ వసూలుచేసి ప్రజలను వేధింపులకు గురిచేసిన చైనా దేశపు ముఠా అశ్లీల సంభాషణలు, బెదిరింపులకు నకిలీ దస్తావేజులతో 1,600 సిమ్కార్డ్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. చైనాకు చెందిన జియాఎమో (38), ఊయాన్లున్ (28), బెంగుళూరుకు చెందిన ప్రమోద (28), పవన్ (27) అనే వారి సహాయంతో వెంటనే లోన్ అందజేసే 50కి పైగా యాప్లు నడిపారు.
వీటి ద్వారా కందు వడ్డీ వసూలుచేశారు. రుణాలు తిరిగి చెల్లించని వారిని మొబైల్ ఫోన్లో సంప్రదించి ఆశ్లీల పదజాలంతో బెదిరించేందుకు 110 మంది ఉద్యోగులతో నకిలీ కాల్ సెంటర్లు నడిపారు. వారిని ఈ నెల 2వ తేది చెన్నై కేంద్ర క్రైం విభాగం పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు.
పోలీసుల విచారణలో, వీరికి చైనాకు చెందిన హాంగ్ అనే వ్యక్తి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. హాంగ్ ప్రత్యేక యాప్ ద్వారా తన కింద పనిచేసే వారిని పర్యవేక్షిస్తు వచ్చాడు. ఇతని ఆధ్వర్యంలో చైనాకు చెందిన ఛీటింగ్ ముఠా పనిచేస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా బెంగుళూరు, చెన్నైలో కార్పొరేట్ ఉద్యోగుల పేరుతో నకిలీ ఆధారాలు అందజేసి 1,600 సిమ్ కార్డ్లు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. ఈ సిమ్కార్డ్లు కొనుగోలు చేసేందుకు సహాయపడిన సమాచార శాఖ ఉద్యోగులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయాత్తమవుతున్నారు.