ఓటుకు నోటు కేసు.. ఆ గొంతు చంద్రబాబుదే..!
సందర్భంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోను కోర్టులో ప్లే చేయగా విని స్టీఫెన్సన్ ధ్రువీకరించారు. అలాగే రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రికార్డు చేసిన వీడియో, ఆడియో దృశ్యాలను కూడా చూసి ధ్రువీకరించారు.
ఓటుకు నోటు కేసు వ్యవహారం మరోసారి చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే.. మనవాళ్లు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఏసీబీ స్పెషల్ కోర్టుకు తెలియజేశారు. తనతో మాట్లాడింది చంద్రబాబే నని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో విచారణలో భాగంగా సోమవారం స్టీఫెన్ సన్ తన వాంగ్మూలాన్ని ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు నమోదు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోను కోర్టులో ప్లే చేయగా విని స్టీఫెన్సన్ ధ్రువీకరించారు. అలాగే రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రికార్డు చేసిన వీడియో, ఆడియో దృశ్యాలను కూడా చూసి ధ్రువీకరించారు. లంచం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో రేవంత్రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలు ఉన్నారంటూ వారిని కోర్టు హాల్లో గుర్తించారు.
‘‘స్టీఫెన్సన్ను ఆయన ఇంట్లో కలవడానికి టీడీపీ నేతలు సిద్ధపడకపోవడంతో మా ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. ఆ రోజు డబ్బు ఇచ్చేందుకు రేవంత్రెడ్డి తదితరులు మా ఇంటికి వచ్చారు. రేవంత్రెడ్డి సూచన మేరకు రూ.50 లక్షలు బ్యాగ్ నుంచి తీసి రుద్ర ఉదయ సింహ టేబుల్ మీద పెట్టారు. ఓటింగ్ తర్వాత రూ.4.5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డయింది. డబ్బు ఇచ్చేందుకు వచ్చింది రేవంత్రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ ఓటుకు కోట్లు కుట్రను కళ్లకు కట్టినట్లు వివరించారు. లంచం ఇస్తున్న సమయంలో ప్రత్యక్షంగా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ కుమార్తెను హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.