రంగారెడ్డి జిల్లాలో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి
రంగారెడ్డి జిల్లాలో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతిచెందాడు.
రంగారెడ్డి జిల్లాలో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని శ్రీకాంత్గా గుర్తించారు. వివరాలు.. దుర్గాదేవి నిమజ్జనం కోసం హిమాయత్ సాగర్ చెరువు వద్దకు వెళ్లిన సమయంలో శ్రీకాంత్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అయితే అక్కడున్నవారు అతడిని కాపాడే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు.
గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలను కొనసాగించారు. కొంతసేపటికి గజ ఈతగాళ్లు చెరువులో నుంచి శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం నెలకొంది.
ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. విజయదశమి సందర్భంగా జల్పాయిగురి జిల్లాలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేస్తుండగా.. చూస్తుండగానే కళ్లముందు.. క్షణాల వ్యవధిలో వరదల ఉదృతి పెరిగింది. పదుల సంఖ్యలో జనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఎనిమిది మంది నీట మునిగి మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది
బుధవారం సాయంత్రం నిమజ్జనోత్సవానికి హాజరయ్యేందుకు వందలాది మంది మల్ నది ఒడ్డున గుమిగూడారు. ఈ సమయంలో ఆకస్మికంగా వరద రావడంతో ప్రజలు కొట్టుకుపోయారని జల్పైగురి జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోద్రా పిటిఐకి తెలిపారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న సీఎం మమతా బెనర్జి హుటాహుటిన రెస్క్యూ ఫోర్స్ను అక్కడికి పంపించి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు.