తెలంగాణలో కూడా రేపో మాపో ఒమిక్రాన్ కేసులు రావొచ్చు: వైద్య ఆరోగ్య శాఖ
రేపో మాపో తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసు నమోదు కావొచ్చని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటికే ఐదు కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: రేపో మాపో తెలంగాణలో కూడా Omicron కేసులు నమోదు కావొచ్చని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ Srinivasa rao ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన 13 మంది శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపినట్టుగా ఆయన తెలిపారు. ఇవాళ సాయంత్రానికి ఫలితాలు వస్తాయని ఆయన వివరించారు.ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. జనవరి 15 నుండి కరోనా కేసుల సంఖ్య పెరిగి ఫిబ్రవరిలో కరోనా కేసులు పీక్ కు చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.తీవ్రమైన ఒళ్లు నొప్పులు, నీరసం, ఒమిక్రాన్ లక్షణాలు అని ఆయన తెలిపారు.
దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 8 నుండి 16 శాతానికి పెరిగాయన్నారు. ఇందులో ఒమిక్రాన్ కేసులే అధికంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులకు శంషాబాద్ విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 900 మందికి పైగా ఇప్పటి వరకు విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చారని ఆయన తెలిపారు. అయితే వీరిలో 13 మందికి మాత్రమే కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు. వీరికి కరోనా నిర్ధారణ అయిందా లేదో అనేది రెండు మూడు రోజుల్లో తేలుతుందన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తే కరోనాను నియంత్రించుకోవచ్చన్నారు. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉందన్నారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశామని ఆయన తెలిపారు. నిన్న ఒక్క రోజే 3.7 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెలాఖరులోపుగా వంద శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
also read:తెలంగాణ: హైదరాబాద్లో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 213 మందికి పాజిటివ్
విదేశాల నుండి వచ్చిన 12 మంది ప్రయాణీకులకు ట్విమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో యూకే నుండి వచ్చిన మహిళా ప్రయాణీకురాలి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెల్స్ కు పంపారు.రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలతో పాటు ఇంట్లో, ఆఫీసుల్లో కూడా మాస్క్ ను ధరించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయాల జరిమానాను విధించనుంది. ఇండియాలో కరోనా కేసులు ఐదుకి చేరుకొన్నాయి. తొలుత కర్ణాటక రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా, నిన్న గుజరాత్, మహారాష్ట్రల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇవాళ ఢిల్లీలో మరో కేసు నమోదైంది. ఇండియాలో ఒమిక్రాన్ కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకొంటుంది. ఆయా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. మరో వైపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.