వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న నిర్మల్ మరోసారి వార్తల్లోకెక్కింది. వాస్తు పేరుతో మున్సిపల్ కార్యాలయ భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 

నిర్మల్ (nirmal) పట్టణంలోని మున్సిపల్ ఆఫీసుకు (municipality office)వాస్తు భయం పట్టుకుంది. 2010లో నూతనంగా నిర్మించిన భవనం కూల్చివేతకు సన్నద్ధమయ్యారు అధికారులు. పన్నెండేళ్ల క్రితం రూ.50 లక్షల వ్యయంతో కార్యాలయాన్ని నిర్మించారు. ప్రారంభం నుంచి భవనాన్ని ఉపయోగించకుండా పాత సామాగ్రి కోసం స్టోర్ రూమ్‌లా వాడుతున్నారు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులకు ఈ భవనం వాస్తు (vaastu) నచ్చకపోవడమే ఇందుకు కారణం. కొత్త భవనం కోసం ప్రతిపాదనలు కూడా పంపించేశారు. ప్రస్తుతం జిల్లాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇకపోతే.. గత కొద్దిరోజులుగా నిర్మల్ జిల్లా వార్తల్లో నిలుస్తోంది. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్‌ మున్సిప‌ల్ వైస్ చైర్మన్‌ షేక్ సాజిద్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జ‌రిగేలా చూస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బాలిక‌పై లైంగిక దాడి చేసిన‌ట్లు సాజిద్‌పై ఫిర్యాదు చేసిన వెంట‌నే పోలీసులు పోక్సో చ‌ట్టం కింద‌ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టార‌ని మంత్రి వెల్లడించారు.

ఇది జరిగిన కొన్నిరోజులకే నిర్మల్ జిల్లాలో కలెక్టర్ (nirmal district collector) టెన్నిస్ (tennis) విధుల కోసం వీఆర్ఏలకు డ్యూటీ వేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సాయంత్రం వేళల్లో కలెక్టర్ బంగ్లా వద్ద టెన్నిస్ బంతులు అందించేందుకు విధులకు హాజరవ్వాలని 21 మంది వీఆర్ఏలకు డ్యూటీలు వేశారు. దీనిపై వివాదం రేగడంతో నిన్న వీఆర్ఏలు లేకుండా టెన్నిస్ ఆడారు కలెక్టర్. అయితే గత గురువారం మరోసారి నిర్మల్ టెన్నిస్ కోర్టుకు వచ్చారు నలుగురు వీఆర్ఏలు. పై అధికారుల్లో ఎవరు టెన్నిస్ ఆడినా బాల్స్ అందిస్తామని వీఆర్ఏలు చెబుతున్నారు. ప్రతిరోజూ డే అంతా డ్యూటీ చేస్తామని.. సాయంత్రం టెన్నిస్ కోర్టు వద్ద డ్యూటీలు వేస్తారని వీఆర్ఏలు అంటున్నారు. నెట్ మధ్యలో ఇద్దరం, వెనకాల ఇద్దరం నిలబడి బాల్స్ అందిస్తామని వారు చెప్పారు. 

నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ (Musharraf Faruqui) ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటలకు నిర్మల్‌ అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం వెనకే ఉన్న గ్రౌండ్‌లో సహచర అధికారులతో కలిసి టెన్నిస్‌ ఆడతారు. కలెక్టర్‌ టెన్నిస్‌ ఆడే సమయంలో కోర్టు వద్ద బంతులు అందించేందుకు రోజుకీ ముగ్గురు చొప్పున వారానికి 21 మంది వీఆర్‌ఏలకు తహసీల్దార్ స్పెషల్ డ్యూటీ వేశారు. వీరిపై పర్యవేక్షణకు మరో ఏడుగురు వీఆర్‌వోలను నియమిస్తూ గత సోమవారం డీ/777/2020 నంబర్‌తో ఆదేశాలు జారీ చేశారు.