బాధితులు వారి సంబంధికులు సోమవారం బేగంపేట కంట్రీ క్లబ్ లోని పబ్ కు వచ్చారు. నృత్యం చేస్తుండగా సైడ్ డాన్సర్ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. 

బేగంపేట కంట్రీ క్లబ్ లోని ఓ పబ్ లో యువతితో సైడ్ డాన్సర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అతని వివరాలు ఇవ్వమన్నందుకు యువతితో పాటు ఆమె సంబంధీకులపై సంబంధిత యజమాని, మరికొందరు దాడిచేసి చితకబాదారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బాధితుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితులు వారి సంబంధికులు సోమవారం బేగంపేట కంట్రీ క్లబ్ లోని పబ్ కు వచ్చారు. నృత్యం చేస్తుండగా సైడ్ డాన్సర్ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో వివాహిత ఆమె సోదరి మేనేజర్ ను కలిసి తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి గుర్తింపు కోసం సీసీ కెమెరా ఫుటేజ్ చూపించాలని అడిగారు. అందుకు అతను నిరాకరించి, పబ్ యజమానిని కలవాలని సూచించారు. దీంతో వారు పబ్ ఇయజమానిని కలిసి విషయం వివరించారు.

పబ్ ప్రతిష్ట దెబ్బ తింటుందని, వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ యజమాని వారితో అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, దుర్భాషలు ఆడాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో వివాహిత సోదరుడు, సమీప బంధువు వచ్చి యజమాని నిలదీశారు.

దీంతో ఆ యజమాని మీరు పార్కింగ్ ప్రదేశం లోకి వెళ్ళండి. అక్కడే మాట్లాడదాం. అంటూ పంపించి... ఆ తర్వాత యజమాని, అతని మనుషులు కర్రలు, గాజు సీసాలతో వారిపై దాడి చేశారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, మిగతా వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి గాయపడ్డ వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి... అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు