నల్గొండ ఫామ్హౌస్లో ఎన్ఆర్ఐ డాక్టర్ జయశీల్ రెడ్డి మిస్సింగ్: పోలీసుల గాలింపు
నల్గొండకు సమీపంలోని మేళ్లదుప్పలపల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిన ఎన్ఆర్ఐ డాక్టర్ జయశీల్ రెడ్డి అదృశ్యమయ్యాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.రేపు జయశీల్ రెడ్డి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో ఆయన అదృశ్యం కావడంతో కటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
నల్గొండ: నల్గొండకు సమీపంలోని మేళ్లదుప్పలపల్లి ఫామ్హౌస్ కు వెళ్లిన ఎన్ఆర్ఐ డాక్టర్ జయశీల్ రెడ్డి అదృశ్యమయ్యాడు. రేపు అమెరికా వెళ్లాల్సిన డాక్టర్ అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఎన్ఆర్ఐ డాక్టర్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గరి బంధువు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల క్రితం జయశీల్ రెడ్డి దర్వేశిపురం వెళ్లారు. అక్కడి నుండి తన తల్లి వ్యవసాయక్షేత్రానికి వెళ్లాడు.
జమైకాలో వైద్య విద్యను పూర్తి చేసిన జయశీల్ రెడ్డి కొంత కాలం క్రితం ఇండియాకు వచ్చి ఇక్కడే ప్రాక్టీస్ చేశాడు. రెండేళ్లుగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అమెరికాలో ఆయన సోదరి స్థిరపడింది. దీంతో ఆయన అమెరికాలోనే ప్రాక్టీస్ చేయాలని భావించాడు. కరోనా కారణంగా ఆయన అమెరికా టూర్ వాయిదా పడింది. అయితే రేపు జయశీల్ రెడ్డి అమెరికా వెళ్లాల్సి ఉంది.
మేళ్లదుప్పలపల్లి ఫామ్ హౌస్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. మేళ్లదుప్పలపల్లిలో 60 ఎకరాల వ్యవసాయ భూమిలో జయశీల్ రెడ్డి వెళ్లి బయటకు రాలేదు. వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లిన జయశీల్ రెడ్డి తిరిగి రాకపోవడంతో డ్రైవర్ మల్లేష్ కూడా వెళ్లి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.జయశీల్ రెడ్డి ఆచూకీ దొరకకపోవడంతో డ్రైవర్ బందువులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది జయశీల్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.