Telangana Rains: ఈ మూడురోజులూ తెలంగాణలో మోస్తరు వర్షాలు... వాతావరణ శాఖ ప్రకటన
తెలంగాణలో రాగల మూడురోజులు తెేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపటి(బుధవారం) నుండి దేశంలోని వాయువ్య ప్రాంతం నుండి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమయ్యే అవకాశం వున్నట్లు తెలిపారు. దీంతో తెలంగాణలో రానున్న మూడురోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
గడిచిన 24గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పెద్దంపేటలో 6.75 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో 5.7సెం.మీ, హైదరాబాద్ లోని కెపిహెచ్బి కాలనీలో 4.70సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇటీవల గులాబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు తెలుగురాష్ట్రాల్లో ముంచెత్తాయి. వర్షాల దాటిక ఏపీతో పాటు తెలంగాణలో పలుప్రాంతాలు నీటమునిగాయి. వరదనీటితో తెలంగాణలోని వాగులు వంకలు, నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహించారు. జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. వరదనీరు రోడ్లపైకి చేరడం, నివాసాలు మునిగిపోవడం వల్ల, ఉదృతమైన నీటి ప్రవాహాలను దాటడానికి ప్రయత్నించి పలువురు ప్రమాదాలకు గురయ్యారు.
ఇక ఈ భారీ వర్షాలు కారణంగా అన్నదాతలు నష్టపోయారు. వరి పంట నీటమునగడం, పత్తి చేతికందివచ్చే సమయంలో వర్షాలు కురవడంతో ఆయా పంటలు వేసిన రైతులు నష్టపోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఇతర పంటలను కూడా నీటిపాలు చేసాయి.