వచ్చేది ఫెడరల్ ప్రభుత్వమే.. మే 23 దాకా ఆగండి : టీఆర్ఎస్
తమ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్. తమ స్టాండ్ ఎప్పటికీ ఫెడరల్ ఫ్రంటేనని తెలిపారు.
మే 23న జాతీయ స్థాయిలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్న అంశం. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ప్రాంతీయ పార్టీలకు దగ్గరవుతున్నాయి.
పాత గొడవలను కూడా మరిచిపోయి స్నేహ హస్తం చాస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోనియా గాంధీ లేఖలు రాశారనే వార్తలు వస్తున్నాయి.
వీటిని అహ్మద్ పటేల్ ఖండించినా.. మే 23 తర్వాత అయినా ఆ వార్త నిజం కావొచ్చు. మరోవైపు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల సాయంతో కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే డీఎంకే చీఫ్ స్టాలిన్ ఇచ్చిన పంచ్తో కేసీఆర్కు మైండ్ బ్లాంకయ్యింది. దీంతో ఆయన ఫెడరల్ ఆలోచనను విరమించుకున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తమ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్.
తమ స్టాండ్ ఎప్పటికీ ఫెడరల్ ఫ్రంటేనని తెలిపారు. ఫ్రంట్ పార్టీలు మే 23న అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతృత్వంలో తెర మీదకు వచ్చే ఫెడరల్ ఫ్రంట్లో బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ కలుస్తాయన్నారు.
ఈ పార్టీలకు దక్కే సీట్లను చూసిన తర్వాత ఫ్రంట్కు మరిన్ని పార్టీల మద్ధతు లభించడం కూడా ఖాయమేనని చెప్పారు. అప్పటికీ తగినంత మెజారిటీ రాకపోతే.. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్ధతిచ్చేందుకు ఓకే అంటే ఆ పార్టీ సహకారాన్ని తీసుకునేందుకు కూడా తాము సిద్ధమేనని రసూల్ తెలిపారు.