వివి బెయిల్ ను మరోసారి పొడిగించిన బాంబే హైకోర్టు.. కానీ...
ఎల్గార్ పరిషద్ కేసులో తనకు మంజూరు చేసిన మెడికల్ బెయిల్ ను పొడిగించాలంటూ విరసం నేత వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ముంబై : విరసం నేత వరవరరావు బెయిల్ ను బాంబే హైకోర్టు మరోసారి పొడిగించింది. తెలంగాణకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 24కు కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 24 వరకు ఇదే స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 24 వరకు ముంబైలోనే ఉండాలని వరవరరావును హైకోర్టు ఆదేశించింది.
ఎల్గార్ పరిషద్ కేసులో తనకు మంజూరు చేసిన మెడికల్ బెయిల్ ను పొడిగించాలంటూ విరసం నేత వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకా తాను ఆరోగ్య సమస్యలతోనే బాధపడుతున్నానని, బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు విధించిన ఒక్క షరతును కూడా తాను ఉల్లంఘించలేదని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల్లో కొంత సడలింపును పొందే అర్హత తనకు ఉందని వరవరరావు పేర్కొన్నారు.
కాగా, ఈ ఫిబ్రవరిలో ప్రముఖ విప్లవ కవి వరవరరావుకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివిగా ప్రఖ్యాతి వహించిన వరవరరావుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏడాది క్రితం గోరెగావ్ కుట్ర కేసులో ఎన్ఐఎ వరవరరావును అరెస్టు చేసింది.
కొంత కాలంగా వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు కుట్ర చేశారనే ఆరోపణపై వరవరరావుతో పాటు మరికొంత మందిని ఎన్ఐఎ ఆరెస్టు చేసింది. ఏడాది తర్వాత వివికి బెయిల్ మంజురైంది.
ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు వరవరరావును ఆదేశించింది. బెయిల్ ముంజూరు చేసినప్పటికీ ముంబై విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వరవరరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వరవరరావుకు కోర్టు మెడికల్ బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. ముంబైలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే ఉండాలని, గత ఎఫ్ఐఆర్ కు దారి తీసిన కార్యకలాపాలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. కరోనా సోకడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన భార్య హేమలత ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.