వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌కు చెందిన వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు కమీషన్ నోటీసులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో జాతీయ మానవ హక్కుల సంఘంలో కేసు నమోదైంది. దీనిపై ఉన్నతాధికారులకు కమీషన్ నోటీసులు జారీ చేసింది. ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే వుంది. ఈ మేరకు నిమ్స్ వైద్యులు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ చేస్తున్నామని.. ప్రీతికి ఇస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్ధితిని వివిధ విభాగాల వైద్యులు పర్యవేక్షిస్తున్నారని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

ఇక, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో బుధవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు.

Also REad: గవర్నర్ పూల దండ ఎందుకు తెచ్చారు? మా అక్క ఏమైనా చనిపోయిందా?: తమిళిసై పై ప్రీతి సోదరి తీవ్ర ఆగ్రహం

దీనిపై ప్రీతి సహవిద్యార్థులు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అప్రమత్తమైన వెంటనే డాక్టర్ ప్రీతిని వెంటిలేటర్‌పై ఉంచి సీటీ స్కాన్‌తో పాటు అన్ని పరీక్షలు నిర్వహించామని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. పీజీ విద్యార్థి శరీరంపై తమకు ఇంజక్షన్ గుర్తు కనిపించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రీతిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నాయి. 

సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఆరోపణలను కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తోసిపుచ్చారు. సీనియర్ విద్యార్థులు డాక్టర్ ప్రీతిని ఎప్పుడూ ర్యాగింగ్ చేయలేదని.. అయితే ఆమె విధులను సక్రమంగా నిర్వర్తించడం గురించి హెచ్చరించినట్లు చెప్పారు. ఇక, ప్రీతి తండ్రి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు.. ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టైన సీరియర్ సైఫ్ నకు జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.