రానున్న నాలుగురోజులూ తెలంగాణలో భారీ వర్షాలు... వాతావరణ కేంద్రం ప్రకటన
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రానున్న నాలుగురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్: తెలంగాణలో నిన్నటి(మంగళవారం) నుండి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాలు మరో నాలుగురోజుల పాటు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఇవాళ, రేపు(గురు, శుక్రవారాల్లో) రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బుధవారం ఉత్తర ఒడిశా నుంచి ఇంటీరియర్ ఒడిశా వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో మంగళవారం ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినా జోగులాంబ గద్వాల జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బుధవారం నుండి గురువారం ఉదయం వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కంకోల్ లో 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అలాగే నిజామాబాద్, మేడ్చల్, జగిత్యాల, ఖమ్మం,నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు పడ్డాయి.