పెళ్లయిన మర్నాడే నవవధువు జంప్... అత్తింటివారి నగలు, నగదు తీసుకుని ప్రియుడితో
పెళ్లయిన తర్వాతి రోజే అత్తింటివారు పెట్టిన నగలు, నగదు తీసుకుని నవవధువు ప్రియుడితో పరారయిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్: పెళ్లయి కనీసం కొన్ని గంటలు కూడా గడవలేదు... పెళ్లివారు కూడా ఇంకా బయలుదేరనే లేదు... ఇంతలోనే పెళ్లికూతురు ప్రియుడితో జంప్ అయిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అత్తింటివారు పెళ్లికి పెట్టిన నగలు, కొంత నగదును తీసుకుని పెళ్ళికూతురు పరారయ్యింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు చెందిన ఓ యువ వ్యాపారి(30)కి ఫలక్ నుమాకు చెందిన యువతి(20)తో వివాహం నిశ్చయమయ్యింది. ఈ నెల 17వ తేదీ రాత్రి వీరిద్దరి వివాహం బాలాపూర్ లో జరిగింది. శనివారం ఉదయం పెళ్లికూతురుతో కలిసి బెంగళూరుకు వెళ్లడానికి సిద్దమయ్యారు. ఇందుకోసం అత్తింటివారు పెట్టిన బంగారు నగలు కూడా యువతి ధరించింది. అయితే తాను బ్యూటీపార్లర్ కు వెళ్లి రెడీ అయి వస్తానని యువతి అన్నా వదినలతో కలిసి బయటకు వెళ్లింది.
read more యువకుడి కలలను చిదిమేసిన పిడుగుపాటు... రూ.20లక్షలు, 50తులాల బంగారం కాలిబూడిద
కొద్దిసేపటి తర్వాత సోదరి కనిపించడం లేదంటూ పెళ్లికూతురు వెంటవెళ్లినవారు వరుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. ఆ తర్వాత యువతి కూడా తన తల్లికి ఫోన్ చేసి వరుడు నచ్చలేడని... అందుకే ప్రియుడితో కలిసి వెళ్లిపోతున్నట్లు తెలిపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.
యువతి ప్రేమవ్యవహారం ముందే తెలిసినా తమను మోసంచేయడానికి యువతి కుటుంబం కుట్ర చేసిందని పెళ్ళికొడుకు తరపువారు పోలీసులకు తెలిపారు. దాదాపు రెండులక్షల విలువచేసే నగలతో పాటు రూ.50వేలు తీసుకుని యువతి పరారయ్యిందని వారు తెలిపారు. ఆ డబ్బులు తమకు తిరిగిస్తే వెళ్లిపోతామని... కేసు పెట్టే ఉద్దేశ్యం కూడా తమకు లేదని వరుడి తరపువారు అంటున్నారు. అయితే ఈ అంశంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.