యువకుడి కలలను చిదిమేసిన పిడుగుపాటు... రూ.20లక్షలు, 50తులాల బంగారం కాలిబూడిద
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెం శివాలయ వీధిలో ఓ ఇంటిపై పిడుగుపడి భవిష్యత్ గురించి ఎన్నో కలలుకన్న ఓ యువకుడి భవిష్యత్ ను కాల్చిబూడిద చేసింది.
పశ్చిమ గోదావరి: ఓ ఇంటిపై పడిన పిడుగుపాటు యువకుడి భవిష్యత్ కలలను కాల్చివేసింది. ఉన్నత చదువుల కోసం కుటుంబానికి జీవనాధారమైన వ్యవసాయ భూమిని కూడా కాదనుకుని పోగుచేసుకున్న డబ్బు కళ్లముందే కాలిబూడిదయ్యింది. లక్షల్లో నగదు, తులాలకొద్దీ బంగారం కాలిబూడిదవుతుంటే చూసి విలపించడం తప్ప ఏమీ చేయలేని దయనీయ పరిస్థితి ఆ యువకుడిది, ఆ కుటుంబానిది. ఇలా ఓ కుటుంబంలో విషాదం నింపింది పిడుగుపాటు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెం శివాలయ వీధిలో కాళ్ల కృష్ణవేణి కొడుకు మహేష్ తో కలిసి నివాసముండేది. కొడుకు భవిష్యత్ బాగుండాలని తపనపడిన ఆ తల్లి ఎంతో కష్టపడి చదివించింది. అయితే అగ్రికల్చర్ బిఎస్సి చదవాలని భావించిన కొడుకు కోసం వెనకాముందు ఆలోచించకుండా ఆ తల్లి జీవనాధానం అయిన వ్యవసాయ భూమిని అమ్మేసింది. భూమి అమ్మగా వచ్చిన రూ.20లక్షలను ఇంట్లో భద్రపరిచారు.
READ MORE విజయనగరంలో బైకును గుద్దిన లారీ.. ఇద్దరు చిన్నారులు మృతి...! (వీడియో)
అయితే శనివారం సాయంత్రం వీరి ఇంటిపై పిడుగు పడింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ మహేష్ చదువుకోసం దాచిన రూ.20లక్షలతో పాటు 50తులాల బంగారం కాలిపోయింది. ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చదువుకోసం దాచిన డబ్బులతోనే మహేష్ భవిష్యత్ గురించి కన్న కలలు కూడా కాలిబూడిదయ్యాయి. బంగారంతో పాటు 20 లక్షలు దగ్ధం అవ్వటంతో తల్లీకొడుకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు ఏంచేయలో అర్థంకావటం లేదని కుటుంబసభ్యులు అవేదన చెందుతున్నారు.