Asianet News TeluguAsianet News Telugu

సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్య కేసు : అక్కని ప్రేమించి మోసం చేశాడు.. కాదు ఆమె చెల్లివరుస అవుతుంది.. కొత్త ట్విస్టులు

కొత్తగూడెంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్య కేసులో నిందితుడు ప్రేమ్ కుమార్ తన అక్కను ప్రేమించి మోసం చేసినందుకే హత్య చేశానంటూ చెప్పుకొచ్చాడు. 

new twists in software employee murder case in kothagudem
Author
First Published Dec 13, 2022, 8:19 AM IST

ఖమ్మం : కొత్తగూడెంలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు అశోక్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.. గొంతు కోసి, చేతి మణికట్టు, కాలు మడమ దగ్గర నరాలు కోసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో..  ఓ ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రేమ్ కుమార్ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ‘అశోక్ కుమార్ మా అక్కను ప్రేమించాడు. ఆ విషయం మాకు తెలిసింది. మేము అడగడంతో పెళ్లి చేసుకుంటానన్నాడు. తర్వాత మోసం చేశాడు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో పాటు నేను అంతకుముందు అశోక్ దగ్గర తీసుకున్న డబ్బులను ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఆ రెండు కోపాలతోనే అతడిని చంపాలని పథకం వేశాను,  ఆ మేరకు అశోక్ కుమార్ ని హతమార్చాను’ అని నిందితుడు ప్రేమ్ కుమార్ పోలీసుల విచారణలో తెలిపారు.

ఈ మేరకు ఇల్లెందు డీఎస్పీ ఎస్ వీ మూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు. సోమవారం టేకులపల్లి పోలీస్స్టేషన్లో వారు మీడియాతో మాట్లాడారు. ‘నిందితుడి తండ్రి గుగులోత్ గోవింద్ ముత్యాలంపాడు క్రాస్ రోడ్డుకు చెందిన వ్యక్తి. ఇతనికి ఒక హోటల్ ఉంది. ఇతనికి ప్రేమ్ కుమార్ (21)తో పాటు, ఓ కూతురు ఉంది. ఆమె శాంతి నగర్ కు చెందిన ధారావత్ అశోక్ కుమార్ ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో.. ప్రేమ్ కుమార్, అతని తల్లికి ఆమెను పెళ్లి చేసుకుంటానని అశోక్ కుమార్ నమ్మించాడు. ఆ తర్వాత మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రేమ్ కుమార్ అతని మీద కక్ష పెంచుకున్నాడు.

గొంతు కోసి, చేతి మణికట్టు, కాలి నరాలు కట్ చేసి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య...

దీనికితోడు గతంలో ప్రేమ్ కుమార్ అశోక్ దగ్గర రూ.60 వేలు తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇచ్చేయమని అశోక్ పదేపదే అడుగుతుండడంతో చంపాలనుకున్నాడు. అందుకే పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని చెప్పి శనివారం రాత్రి ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లోని పంచాయతీ ఆఫీస్ కి రావాలి అని చెప్పాడు.  అక్కడికి వచ్చిన అశోక్ ను తల మీద రాడ్ తో బలంగా కొట్టి, కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత కాలి మడమ నరాలు, చేతి మణికట్లు నరాలు కోసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అయ్యప్పస్వామి పూజకు వెళ్లిపోయాడు. హత్య విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ప్రేమ్ కుమార్ దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యానేరం ఒప్పుకున్నాడని’ డిఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.

అయితే, మృతుడు అశోక్ కుమార్ తండ్రి మాత్రం.. తన కొడుకు.. ప్రేమ్ కుమార్ సోదరి వరుసకు చెల్లెలు అవుతుందని.. వీరి మధ్య ప్రేమ వ్యవహారం లేదని.. పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మృతుడు అశోక్ కుమార్, ప్రేమ్ కుమార్ సోదరిలకు సంబంధించిన ఫోన్ అయిదేళ్ళ కాల్ లిస్టులు.. పరిశీలిస్తే విషయం తెలుస్తుందని అంటున్నారు. డబ్బుల కోసం మాత్రమే హత్య చేశానని ప్రేమ్ కుమార్ ఒప్పుకున్నాడని.. అయితే.. మధ్యలో ప్రేమ వ్యవహారం ఎక్కడినుంచి వచ్చిందని మృతుడి తండ్రి బాలాజీ,  భార్య అమల.. గ్రామస్తులు పోలీసులను నిలదీశారు. హత్య కేసులో ఉన్న మిగతా వారిని కాపాడేందుకు ఈ ప్రయత్నాలన్నీ వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios