అమానుషం : తొమ్మిదినెలలు మోసి.. మృతశిశువు కావడంతో చెత్తకుప్పలో పడేసి.
కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రులే విగతజీవిగా పుట్టిందని ఆ చిన్నారిని చెత్తకుప్పల్లో పడేశారు. కనీసం తొమ్మిదినెలలు కడుపులో మోసినందుకైనా సక్రంగా అంత్యక్రియలు చేయకుండా అమానుషంగా ప్రవర్తించారు. తల్లి గర్భంలోనే నిండు నూరేళ్లూ నిండిన ఆ చిన్నారికి చావులోనూ అన్యాయమే జరిగింది.
కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రులే విగతజీవిగా పుట్టిందని ఆ చిన్నారిని చెత్తకుప్పల్లో పడేశారు. కనీసం తొమ్మిదినెలలు కడుపులో మోసినందుకైనా సక్రంగా అంత్యక్రియలు చేయకుండా అమానుషంగా ప్రవర్తించారు. తల్లి గర్భంలోనే నిండు నూరేళ్లూ నిండిన ఆ చిన్నారికి చావులోనూ అన్యాయమే జరిగింది.
హృదయాల్ని మెలిపెట్టే ఈ విషాద ఘటన గురువారం మహబూబ్నగర్లో కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ చెప్పిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం బకారం గ్రామానికి చెందిన మహిళ మూడో కాన్పు కోసం మార్చి 29న నాగర్కర్నూల్ ఆస్పత్రికి వెళ్లింది.
అయితే అప్పటికే గర్భంలోనే శిశువు మృతి చెందడంతో ఇది హై రిస్క్ కేసు అని వారు మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. రాత్రి 11.30కి మహబూబ్నగర్ ఆస్పత్రికి వచ్చారు. కేసు సీరియస్ కావడంతో రాత్రి 1.30 ప్రాంతంలో ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మృతి చెందిన ఆడ శిశువును బయటకు తీశారు.
అప్పటికే శిశువు మృతి చెందడంతో తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో శిశువు మృతదేహాన్ని తండ్రికి అప్పగించి స్వగ్రామానికి తీసుకెళ్లమని చెప్పారు. అలాగే అని తెలిపి బయల్దేరిన కుటుంబ సభ్యులు, మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోకుండా.. పట్టణంలోని ఓ డ్రైనేజీ సమయంలో ఉన్న చెత్తకుప్పలో పడేశారు.
రాత్రి పూట కావడంతో ఇది ఎవరూ గమనించలేదు. కాగా గురువారం ఉదయం స్థానికులు దీన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న టూటౌన్ పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు.
ఆ శిశువు చేతికి ఆస్పత్రి సిబ్బంది కట్టిన ట్యాగ్ ద్వారా ఎవరి శిశువు అనే విషయాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే ఆ శిశువు కుటుంబ సభ్యులను పిలిపించి అడిగితే, తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.