డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే ఏజీఎం
తెలంగాణ రాష్ట్రంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొనడానికి ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే ఏజీఎం బి.బి సింగ్ చెప్పారు.
సోమవారం నాడు ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ ఇంకా రైలులోనే ఇర్రుకొన్నాడు. ఆయనను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
also read:mmts train accident: కాచిగూడలో రెండు రైళ్ల ఢీ, 30 మందికి గాయాలు
ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని రైల్వే ఏజీఎం బి.బి. సింగ్ అభిప్రాయడ్డారు. ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టడంతో ఎంఎంటీఎస్ రైలులోని ఆరు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు.లింగంపల్లి పలక్నుమా మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టుగా రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.
మరోవైపు కేబిన్లో చిక్కుకొన్న ఎంఎంటీఎస్ డ్రైవర్ ను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నట్టుగా రైల్వే అధికారులు తెలిపారు. గ్యాస్ కట్టర్ ద్వారా కేబిన్ ను కత్తిరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు.
డ్రైవర్ కేబిన్ లో చిక్కుకొన్న డ్రైవర్ కు ఆక్సిజన్ ను అందిస్తున్నట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులను ఉస్మాయా ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు.