ఎంతమంది ఎన్ని పథకాలు పెట్టినా.. వాటికి ఎన్టీఆరే స్ఫూర్తి: బాలకృష్ణ
భూమ్మీద చాలా మంది పుడతారు, గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరని అభిప్రాయపడ్డారు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ. రామారావు 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు
భూమ్మీద చాలా మంది పుడతారు, గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరని అభిప్రాయపడ్డారు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ. రామారావు 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు.
అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. ఒక మనిషి మహోన్నతుడు కావాలంటే అకుంఠిత దీక్షకావాలి, సత్సంకల్పం కావాలని, నమ్మిన దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు నడవాలని ఎన్టీఆర్ రుజువు చేశారని బాలకృష్ణ అన్నారు.
ఎంత మంది నాయకులు వచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అవన్నీ ఎన్టీఆర్ ముందు చేసినవేనని బాలయ్య వ్యాఖ్యానించారు. లంచగొండితనం ఇష్టం లేక ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశారన్నారు. సినిమాల్లో ఎదురులేకుండా సాగిన ఆయన రాజకీయాల్లోనూ అంతే స్థాయిలో వెలుగొందారని,పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు.
బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వారికి రాజ్యాధికారాన్ని అందించిన ఘనత ఎన్టీఆర్దేనని బాలయ్య అన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ మనతోనే ఉంటారన్నారు. అన్నగారు ఏ ఆశయాల కోసం కృషి చేశారో వాటి కోసం పనిచేస్తామన్నారు.