కోదాడ, హుజూర్నగర్లు మావే.. 50 వేల మెజార్టీ గ్యారెంటీ, ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం: ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ స్థానాలు తమవేనన్నారు టీపీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 50 వేలకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ విసిరారు.
ఇక కొద్దిరోజుల క్రితం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం సందర్భంగా కోదాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు సొంతిల్లు కూడా లేదని.. తమకు పిల్లలు కూడా లేరని, కోదాడ, హుజూర్నగర్ ప్రజలే తమ పిల్లలుగా భావిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేసి తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన గుర్తుచేశారు. పదవిలో వున్నా లేకునా ప్రజల కోసమే పనిచేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే... పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా విజయం సాధించిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి పదవులతో పాటు ఇతర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారని ఆయన ఆరోపించారు.
ALso REad: ఫిరాయింపులతో బలాన్ని పెంచుకున్నారు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ,పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,ఎల్ బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కులపై కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.