అర్ధరాత్రి సమాధి నుండి శవాన్ని బయటకు తీసి రోడ్డుపై పడేసి అత్యంత దారుణంగా వ్యవహరించి ఓ కుటుంబం. ఈ అమానుష ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

నల్గొండ: మానవత్వానికి మచ్చగా నిలిచే సంఘటన ఇది. ఖననం చేసిన మృతదేహాన్ని అర్థరాత్రి సమయంలో బయటకు తీసి రోడ్డుపై పడేసి ఓ జంట అమానవీయంగా వ్యవహరించారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... కేతెపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన వంగూరి బుచ్చమ్మ(58) అనే మహిళ మృతిచెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని వంగూరి కుటుంబానికి చెందిన ఉమ్మడి భూమిలో వున్న స్మశానవాటికలో ఖననం చేశారు. ఈ అంత్యక్రియల సమయంలోనే వంగూరి చంద్రయ్య అనే వ్యక్తి మృతురాలి కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. తన పొలం పక్కన మృతదేహాన్ని ఖననం చేయవద్దని అతడు అడ్డుకోడానికి ప్రయత్నించాడు. కానీ మృతురాలి కుటుంబసభ్యులు మాత్రం ముందుగా నిర్ణయించిన చోటే మృతదేహాన్ని ఖననం చేశారు. 

దీంతో కోపోద్రిక్తుడయిన చంద్రయ్య మానవత్వాన్ని మరిచి దారుణానికి ఒడిగట్టాడు. భార్య రుక్కమ్మతో కలిసి అర్థరాత్రి స్మశానవాటికకు వెళ్లి బుచ్చమ్మ సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ శవాన్ని సమీపంలోని రహదారిపై పెట్టి వెళ్లిపోయారు. 

ఉదయం రోడ్డుపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతురాలి కుమార్తె శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రయ్యతో పాటు అతడికి సహకరించిన భార్య రుక్కమ్మ, కుమార్తె కవితలపై కేసు నమోదు చేశారు పోలీసులు.