మల్లారెడ్డి కార్మిక మంత్రిగా ఉండడం మన కర్మ: నాయిని సంచలనం
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డి ఉండడం మన కర్మ అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయిని నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నాయిని నర్సింహరెడ్డి ప్రసంగించారు.
ప్రజల పక్షాలన చేయాల్సిన మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్మికులు ఇబ్బందులు పడుతోంటే మంత్రి పట్టించుకోకుండా ఉంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పనికిరాని కార్మిక మంత్రిని చూస్తే జాలి వేస్తోందన్నారు. రాష్ట్రంలో కార్మికులు సమ్మెలు కూడ చేసే పరిస్థితి కూడ లేకుండా పోయిందన్నారు.
ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఏపీ సీఎం జగన్ పై నాయిని నర్సింహారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఏపీలో మూడు రాజధానుల విషయంలో జగన్ తీసుకొన్న నిర్ణయాన్ని నాయిని నర్సింహారెడ్డి సమర్ధించారు.