తాజా ఎంపీ VS మాజీ ఎంపీ.. టీఆర్ఎస్ లో కార్యకర్తల సాక్షిగా భగ్గుమన్న వర్గ విభేదాలు..
మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీల మధ్య పదవులు, బ్రాండ్ల విషయంలో ఆవేశపూరిత వ్యాఖ్యలు సాగాయి. ఆదివారం సాయంత్రం మధిరలో జరిగిన సభలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో వర్గాలు, కులాలు లేవని, నిబద్ధతతో పనిచేస్తే పదవులు తప్పకుండా వస్తాయని అన్నారు.
మధిర : ఖమ్మం (Khammam)జిల్లా మధిరలో (madhira constituency) ఆదివారం జరిగిన మధిర నియోజకవర్గ స్థాయి సభలో టీఆర్ఎస్ (TRS)నాయకుల్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బహిర్గతమయ్యాయి. పార్టీలో వర్గాలు లేవని, అంతా ఒక్కటేనని అధినాయకత్వం చెబుతున్నా.. జిల్లలాలో ఎవరికి వారే అన్న విషయం మధిర సభలో తేటతెల్లమయ్యింది.
మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీల మధ్య పదవులు, బ్రాండ్ల విషయంలో ఆవేశపూరిత వ్యాఖ్యలు సాగాయి. ఆదివారం సాయంత్రం మధిరలో జరిగిన సభలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో వర్గాలు, కులాలు లేవని, నిబద్ధతతో పనిచేస్తే పదవులు తప్పకుండా వస్తాయని అన్నారు.
అంతకు ముందు మాట్లాడిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ‘మధిరలో శ్రీనన్న బ్రాండ్ ఉంది. నేను ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్తా, పార్టీ సమావేశాలకు ఎక్కడికైనా ఎవరైనా నాయకులు హాజరు కావచ్చు. అంతేకానీ ఫలానా నాయకుడి వెంట వెళ్లి పదవులు తీసేస్తానని చెప్పడం సరికాదు’అని వ్యాఖ్యానించారు.
దీనిపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందిస్తూ.. ‘పార్టీలో ఎవరి బ్రాండ్ లేదు. ఉన్నదంతా కేసీఆర్ బ్రాండే. జిల్లాలో టీఆర్ఎస్ కు ఎంతో బలం ఉంది. వర్గాలు, కులాలు ఏమీ లేవు. పదవులు రానివాళ్లకు అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు. నేతల వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఇదే సభలో నేతలు తమ ఐక్యతను చాటుతూ అభివాదం చేయడం కొసమెరుపు.