కిషన్ రెడ్డి గారు .. ఆ పని త్వరగా అయ్యేట్లు చూడండి: రేవంత్ ట్వీట్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. మల్కాజ్గిరి కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలంటూ రేవంత్ కోరారు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. మల్కాజ్గిరి కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలంటూ రేవంత్ కోరారు.
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎంపీగా, ఓ ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతగా కంటోన్మెంట్ బొల్లారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశామన్నారు. నియోజకవర్గంలోని కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని 15 రోజుల క్రితమే నిర్ణయించామని రేవంత్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా చురుగ్గానే సాగుతున్నాయని తెలిపారు.
ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించడంలో ఆక్సిజన్ ప్లాంట్ అత్యంత కీలకమని రేవంత్ తెలిపారు. పీఎం కేర్ నిధుల ద్వారా బొల్లారం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి, డీఆర్డీవో చైర్మన్కు కూడా లేఖలు రాసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ట్విట్టర్ ద్వారా కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.