కరీంనగర్ లోని ఓ కుటుంబంలో ఏడు నెలల్లో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు చావు భరించలేక ముసలి తల్లి గుండెపోటుతో మరణించింది.
కరీంనగర్ : కరీంగనర్ జిల్లా తిమ్మాపూర్ లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కుటుంబ గొడవల కారణంగా భార్య ఏడునెలల క్రితం తల్లిగారింటి దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏడు నెలల తరువాత మొదటి మ్యారేజ్ డే రోజు ఆదివారం రాత్రి అదే ప్రాంతంలో భర్త శ్యాంసుందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం శ్యాంసుందర్ మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో శ్యాం సుందర్ తల్లి మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది. కొడుకు మరణవార్త విని తీవ్రంగా రోధించింది. దీంతో ఈ రోజు ఉదయం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పింది.
బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెడుతుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. ఒకే కుటుంబంలో ఏడు నెలల్లో ముగ్గురి మరణాలతో వారి బంధువులు, కుటుంబసభ్యుల్లో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెళ్లైన నాలుగు నెలలకు ఉరేసుకుని భార్య మృతి.. అదేచోట పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య...
ఇదిలా ఉండగా, తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన నాలుగు నెలలకే ఓ భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా… అదేచోట సరిగ్గా పెళ్లి రోజుకు ముందు భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ ఈ విధంగా వివరాలు తెలియజేశారు. శ్యాంసుందర్ (35) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరుకు చెందిన వ్యక్తి. జానపద కళాకారుడు.
హుస్నాబాద్ లోని గోదాం గడ్డ కాలనీకి చెందిన శారద అనే యువతితో ఏడాది క్రితం శ్యాంసుందర్ పెళ్లి జరిగింది. కొద్ది రోజులపాటు భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పుట్టింటికి వచ్చింది శారద. అలా వచ్చిన శారద నిరుడు సెప్టెంబర్ 20న ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే అప్పటికే ఆమె మానసిక స్థితి సరిగాలేదని.. ఈ కారణంగానే ఈ దారుణానికి ఓడిగట్టి ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్య మరణించడంతో శ్యాంసుందర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఆమె లేకుండా ఒంటరి జీవితం భరించలేకుండా ఉన్నానంటూ స్నేహితులతో.. కుటుంబ సభ్యులతో తరచూ చెబుతుండేవాడు. మే 15న వారి పెళ్లి రోజు. అంతకు ముందు రోజు మే 14వ తేదీన హుస్నాబాద్ లోని అత్తగారింటికి వెళ్లిన శ్యాంసుందర్.. ఆరోజు రాత్రి.. భార్య ఉరివేసుకున్న చెట్టు కిందనే పురుగుల మందు తాగి పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు.
ఈ విషయం రాత్రి ఎవరూ గమనించలేదు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
