ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : ఢిల్లీ పెద్దలతో నిందితుల ఫోటోలు, వాట్సాప్ ఛాట్.. సిట్ చేతికి కీలక ఆధారాలు
మొయినాబాద్ ఫాంహౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన సిట్ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలతో నిందితుల సంబంధాలకు సంబంధించి సిట్ చేతికి కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు కీలక ఆధారాలు సమర్పించింది సిట్ బృందం. ఢిల్లీ పెద్దలతో నిందితులు రామచంద్రభారతి, నందకూమార్ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్స్ను కోర్టుకు సమర్పించింది. అంతేకాకుండా అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలు, వారి మధ్య జరిగిన సంభాషణల వివరాలను కోర్టుకు సమర్పించారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది.
ఇకపోతే.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి బుధవారం తెలంగాణ హైకోర్టులో వాడీవాడీగా వాదనలు జరిగాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు న్యాయస్థానం కేసు విచారణను ప్రారంభించింది. మధ్యాహ్నం కొద్దిసేపు లంచ్ బ్రేక్ ఇచ్చింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ తిరిగి ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్వంత్ ధవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ , ఇదే కేసుకు సంబంధం ఉన్న మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా పలువురు న్యాయవాదులు తమ వాదనలను విన్పించారు.
Also REad:సిట్ విచారణకు భయమెందుకు: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టులో వాడీవేడీగా వాదనలు
తప్పు చేయకపోతే సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే వాదించారు. అరెస్టైన నిందితులకు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలున్నాయిన ధవే వాదించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎందేనని ధవే ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరాన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ బయట పెట్టారని ధవే గుర్తు చేశారు. ఇది తప్పేలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. సిట్ విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని దుశ్వంత్ ధవే ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే సిట్ విచారణను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని బీజేపీ తరపున న్యాయవాది జెఠ్మలానీతోపాటు నిందితుల తరపున న్యాయవాదులు వాదించారు.
ఈ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ దర్యాప్తు నిర్వహిస్తున్న విషయాన్ని ధవే కోర్టు ముందుంచారు. సీబీఐ లేదా స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని బీజేపీ సహా నిందితుల తరపున న్యాయవాదులు కోరుతున్నారు. సీఎం కనుసన్నల్లోనే సిట్ విచారణ జరుగుతుందన్నారు.ఈ మేరకు గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన కేసుల ఉదంతాలను కూడా న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.