ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ‘కవిత’ను నేను: అమ్మా.. కమల బాణం అంటూ షర్మిలకు కవిత కౌంటర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ ట్విట్టర్లో వార్ కొనసాగుతుంది. తాజాగా షర్మిలను కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారేట్టు అని విమర్శించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ ట్విట్టర్లో వార్ కొనసాగుతుంది. తాజాగా షర్మిలను కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారేట్టు అని విమర్శించారు. వివరాలు.. తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం, టీఆర్ఎస్ శ్రేణుల దాడులకు నిరసనగా షర్మిల చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. అయితే షర్మిల పాదయాత్రను అడ్డుకోవడంపై పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. ఈ క్రమంలోనే బీజేపీని ఉద్దేశించి ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.
‘‘తాము వదిలిన “బాణం”.. తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” ’’ అని కవిత ట్వీట్ చేశారు. అయితే కవిత ట్వీట్పై స్పందించిన షర్మిల.. పదవులే గానీ పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవ లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’’ అని షర్మిల ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కవిత.. షర్మిలపై ‘‘కవిత’’ రూపంలో విమర్శలు గుప్పించారు.
‘‘అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణం.. పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు.. నేడు తెలంగాణ రూటు. మీరు కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారేట్టు. మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను.. రాజ్యం వచ్చాకే రాలేదు నేను.. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి " కవిత" ను నేను !’’ అని కవిత ట్వీట్ చేశారు. మరి కవిత ట్వీట్పై షర్మిల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ఇక, మరోవైపు పాలకపక్ష ఆగడాలు పతాక స్థాయికి చేరినపుడు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దాడులకు పాల్పడినపుడు పార్టీలకు అతీతంగా నిలదీయడం అందరి కర్తవ్యం అని పేర్కొన్నారు. తన పోరాటానికి మద్దతు తెలిపి, ప్రభుత్వ దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖలకు ధన్యవాదాలు తెలిపారు.