ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్ శాతం ఎంతంటే.. ?
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. స్వల్ప ఘటలు మినహా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు నిర్వహించిన ఎన్నికలు ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు వరకు కొనసాగింది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 6 స్థానాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహించారు. స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ నెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
కాంగ్రెస్ ఓట్లు కూడా టీఆర్ఎస్ కే: మంత్రి జగదీష్ రెడ్డి సంచలనం
ఏ జిల్లాలో ఎంత పోలింగ్ ?
మొత్తం ఉమ్మడి 5 జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ జరిగింది. ఇందులో ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో రెండు స్థానాలు ఉండగా, మిగిలిన జిల్లాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. కరీంగనర్లో 1324 ఓట్లు ఉంటే 1320 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 99.70 శాతంగా పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతంగా ఓటింగ్ నమోదైంది.
ఖమ్మం ఉమ్మడి జిల్లా పరధిలో 768 ఓట్లు ఉంటే 740 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 95 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి మెదక్ పరిధిలో 1026 ఓట్లు ఉంటే 1018 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 421 ఓట్లు ఉంటే 412 ఓట్లు పోలయ్యాయి.
కరోనా నిబంధలను పాటిస్తూ..
శుక్రవారం ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఓటర్లందరూ భౌతికదూరం పాటించేల అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో కేవలం స్థానిక సంస్థల సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉండటంతో తక్కువ సంఖ్యలోనే ఓటర్లు ఉంటారు. అందుకే అధికారులకు ఈ ఎన్నికలు నిర్వహించడం సులభతరమైంది.