బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ నగేష్లకు తృటిలో ప్రమాదం తప్పింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ నగేష్లకు తృటిలో ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ముగ్గురు నేతలు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. ఈరోజు మహారాష్ట్రలోని నాగ్పూర్ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంబోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్(టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ జి నగేష్లు ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్కు బయలుదేరారు.
Also Read: చంచల్గూడ జైలులో వైఎస్ భాస్కర్ రెడ్డిని కలిసిన ఆయన కొడుకు అవినాష్ రెడ్డి
అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పంధర్కవాడ-బోరి గ్రామాల మధ్య రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. వాహనానికి అడ్డం వచ్చిన పశువులను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, జి నగేష్లు మరో వాహనంలో నాగ్పూర్కు బయలుదేరి వెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించి జోగు రామన్న ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నాగ్పూర్లో జరిగే కేసీఆర్ సమావేశానికి హాజరవుతున్న సందర్భంగా రోడ్డుమీద ఆకస్మికంగా పశువులు అడ్డం రావడంతో చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవలసినవసరం లేదు’’ అని జోగు రామన్న పేర్కొన్నారు.
