మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జైలులో ఉన్న భాస్కర్ రెడ్డిని ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు కలిశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జైలులో ఉన్న భాస్కర్ రెడ్డిని ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు కలిశారు. ములాఖత్లో భాగంగా జైలు అధికారుల అనుమతితో తన తండ్రి భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డి కలిశారు. ఇటీవల భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిని అవినాష్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఇక, వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఏడో నిందితుడిగా ఉన్నారు. భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16న సీబీఐ అరెస్ట్ చేసింది. నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు భాస్కర్ రెడ్డి కూడా ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది. భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 16 నుంచి జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని ఆరు రోజుల పాటు ప్రశ్నించారు. ఇక, తన ఆరోగ్యం క్షీణించడంతో భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ బెయిల్ పిటిషన్ను ఇటీవల సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ కోర్టు ఆయన కస్టడీని జూన్ 16 వరకు పొడిగించింది.
మరోవైపు ఈ కేసులో అవినాష్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించింది. అయితే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు విధించిన షరతుల మేరకు.. అవినాష్ రెడ్డి శనివారం రోజున సీబీఐ విచారణకు హాజరవుతూ వస్తున్నారు.