తెలంగాణా వచ్చాక, మళ్లా ఉద్యమం ఎంది బే
ఉద్యమం అని ఎవడయినా వస్తే ఉరికిచ్చి కొట్టండి
తీగెల కృష్ణారెడ్డిని ఒక విషయానికి అభినందించాలి. ఆయన మాటల్లో చేతల్లో నిలకడ ఉంటుంది.
పూర్వం తెలంగాణా ఉద్యమం రోజుల్లో ఆయన తెలంగాణా కు వ్యతిరేమయిన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించారు.
తెలంగాణా వచ్చాక, అదే పార్టీ మీద మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెల్చారు. తర్వాత పార్టీ వదిలేసి పింకు కండువా కప్పుకున్నారు. ఇంతమాత్రాన అయన మారారనుకోవద్దు, ఇపుడు కూడా ఆయన ఉద్యమాలకు వ్యతిరేకమే. ఇపుడు తెలంగాణాలో ఉద్యమాలకు వ్యతిరేకమే. అపుడు తెలంగాణా ఉద్యమానికి, ఇపుడు తెలంగాణాలో ఉద్యమాలకు వ్యతిరేకమనే చెబుతున్నారు.పార్టీ ఫిరాయించినా లైన్ మార్చుకోలేదు,అదీ ఆయన గొప్పతనం.
ఈ విషయం సోమవారంనాడు బాహాటంగా చెప్పారు, మామూలు కాదు, చూపుడు వేలు గాలిలో వూపుతూ మీరీ చెప్పారు. “ఉద్యమకారులారా... ఖబడ్దార్! తెలంగాణా రాష్ట్రం వచ్చింది. ఇంకెక్కడి ఉద్యమం,” అంటూ వూగిపోయారు. అంతటితో ఆగలేదు.
“ఉద్యమకారులంటూ ఎవడయినా నియోజకవర్గంలో తిరిగితే ఉరికిచ్చి కొట్టండి,” అని అనుచరులకు పిలుపు నిచ్చారు.
ఇది ఎక్కడో నాలుగు గోడల మధ్య జరిగింది కాదు. మహేశ్వరంలో టిఆర్ ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఆగ్రహం ఎంతవరకు పోయిందంటే, ఈ కార్యక్రమానికి వచ్చిన పార్టీ సీనియర్ల నెవరినీ ఆయన వేదిక మీదకు పిలవ లేదు. కారణం వాళ్లంతా గతంలో ఉద్యమంలో పాల్గొని ఉండటమే.
ఉద్యమం మీద అంత వ్యతిరేకత ఉండటం, తమని ఖాతరు చేయకపోవడంతో సీనియర్లకు,తీగెల వర్గానికి కొద్ది సేపు పెనుగులాట కూడా జరిగింది.
తర్వాత ఏంచేస్తారు, నోరు మూసుకుని సర్దుకుపోయారట.