ప్రీతి మీనా చేయిపట్టుకున్న ఎమ్మెల్యే లొంగుబాటు
- కలెక్టర్ చేయి పట్టుకున్న ఎమ్మెల్యేపై కేసులు
- లొంగిపోయిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
- స్టేషన్ బెయిల్ పై విడుదల
- పట్టు వీడని కలెక్టర్ ప్రీతి మీనా
మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా చేయి పట్టుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఆరోపనల మీద ఎమ్మెల్యేపై కేసులు నమోదయ్యాయి.
ఎమ్మెల్యే మీద కేసులు నమోదు కావడంతో గురువారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్ లో ఆయన లొంగిపోయారు. పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వెంటనే బయటకు పంపివేశారు. ఇక ఈ వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడంలేదు. కలెక్టర్ ప్రీతి మీనా తీవ్ర మనోవేధనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆమెకు ఎమ్మెల్యే భేషరతు క్షమాపణ చెప్పారు. అయినా ఆమె పట్టువీడలేదు. క్షమాపణలతో సరిపెడితే ఊరుకునేది లేదని కలెక్టర్ ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే పై శిక్ష పడితేనే రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడాలేంట ప్రజాప్రతినిధులు భయపడే పరిస్థితి వస్తుందని పలువురు ఉన్నతాధికారులు అంటున్నారు.
మరోవైపు గురువారం ఐఎఎస్ అధికారుల అత్యవసర మీటింగ్ జరగనుంది. ఆ సమావేశంలో కలెక్టర్ ప్రీతిమీనా కు జరిగిన అవమానంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేను టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని ఐఎఎస్ అధికారుల సంఘం కోరే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.