మాటల యుద్దం: కడియం ఘాటు వ్యాఖ్యలు... అదేస్థాయిలో కౌంటరిచ్చిన రాజయ్య
టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్యల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
జనగామ: వారిద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు, ప్రస్తుతం ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాగా మరొకరు ఎమ్మెల్సీ. ఒకేపార్టీలో వున్న వీరిమధ్య ప్రత్యర్థుల కంటే ఎక్కువగా రాజకీయ వైరం వుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భగ్గుమన్న రాజకీయ వైరం మధ్యలో కాస్త శాంతించినా ఇప్పుడు మళ్లీ మొదలయ్యింది. ఇలా టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్యల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
ఆదివారం స్టేషన్ ఘనపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్యపై కడియం తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాజాగా కడియం వ్యాఖ్యలపై రాజయ్య కూడా కౌంటరిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో వుంటున్నానని... ఇలా తనకు వస్తున్న ప్రజాదరణను చూసి కడియం ఓర్వలేకపోతున్నారని రాజయ్య ఆరోపించారు. అందువల్లే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
Video చేతకానివాడు, నెత్తిమీద రూపాయి పెట్టినా అమ్ముడుపోనివాడు..: సొంతపార్టీ ఎమ్మెల్యేపై కడియం ఫైర్
తనపై కడియం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పార్టీ శ్రేణులు సంయమనంతో వుండాలని సూచించారు. ఆయనలాగా తాను వ్యక్తిగత దూషణకు దిగాలని అనుకోవడం లేదని... అధిష్టానమే ఆయనపై చర్యలు తీసుకుంటుందని పరిశీలిస్తుందన్నారు. సరయిన సమయంలో ఎవరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో టీఆర్ఎస్ అధిష్టానానికి బాగా తెలుసన్నారు రాజయ్య. వ్యక్తిగత స్వార్థంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించ వద్దని శ్రీహరికి రాజయ్య సూచించారు.
తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పదవుల కోసం ఒక్క పైసా తీసుకొన్నట్టుగా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని రాజయ్యకు కడియం సవాల్ విసిరారు. చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడుతాడని చెల్లని రూపాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా... పదవి ఇప్పిస్తాననో... పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి అయినా తీసుకున్నట్లు నిరూపించాలన్నారు.
పదవులు అమ్ముకుంటున్నారు పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.