మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజాసింగ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రాజా సింగ్ను సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజాసింగ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రాజా సింగ్ను సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబరు 2 లోపు కేంద్ర క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై రాజా సింగ్ తాజాగా స్పందించారు.
పార్టీ జారీచేసిన షోకాజ్ నోటీసుపై వీలైనంత త్వరగా సమాధానం ఇస్తానని రాజా సింగ్ తెలిపారు. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. పార్టీ తనను వదులుకోదని అనుకుంటున్నట్టుగా తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తనకు నమ్మకం ఉందన్నారు. తాను విడుదల చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని చెప్పారు. కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడలేనని తెలిపారు. తనపై నమోదైన అన్ని కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.
ఇదిలా ఉంటే.. మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పలు పోలీసు స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పోలీసులు రాజాసింగ్ను అరెస్ట్ చేశారు. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో సోమవారం రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పాతబస్తీలో రోడ్ల పైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్దసంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మొగల్పురాలో పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి పంపించివేశారు.
రాజాసింగ్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నందున నగర పోలీసులు బుధవారం పాతబస్తీలోని అన్ని పెట్రోల్ పంపులను మూసివేశారు. భారతీయ పురావస్తు శాఖ (ASI) అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. చార్మినార్ సందర్శకుల కోసం తెరిచి ఉంచబడిందని, అయితే ఏదైనా పెద్ద నిరసన లేదా పరిస్థితులు దిగజారే విధంగా ఉంటే మూసివేయబడుతుందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్కు చెందిన పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించారు.
