మూసీ నది కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
మూసీ నది కబ్జాకు గురికావడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తింది.
హైదరాబాద్: మూసీ నది కబ్జాకు గురికావడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ నగరంలో వరదపై ఆయన మాట్లాడారు. మూసీనదిలో మట్టిని నింపి నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. దీని కారణంగా మూసీ నది కబ్జా కారణంగా వరద నీరు వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
మూసీ నది కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీలో నాలాలను కబ్జా చేసిందని ఆయన ఆరోపించారు. నగరంలో భారీ వర్షాల కారణంగా సుమారు 250 కాలనీలు నీటిలోనే ఉన్నాయి. రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్లకు ఆరెంజ్ ఆలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైద్రాబాద్ తో పాటు ఇతర జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది ప్రభుత్వం. భద్రాద్రి , వరంగల్ , నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.