తెలంగాణ: త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. సర్కార్ నిర్ణయం కోసం ఈసీ ఎదురుచూపులు
కొవిడ్ ఉద్ధృతి తగ్గి ప్రస్తుతం అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై ఈసీ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగిసింది. గుత్తా సుఖేందర్రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత.. పదవీకాలం పూర్తయిన వారిలో ఉన్నారు.
సాధారణంగా గడువు ముగిసే సమయానికంటే ముందే ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే, ఈసారి కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని ప్రకటించింది. దీంతో జూన్ 3 నుంచి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.
కొవిడ్ ఉద్ధృతి తగ్గి ప్రస్తుతం అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయమై ఈసీ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ అందినట్టు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఈసీ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. సర్కార్ అభిప్రాయం తర్వాతే ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.