పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య ఇదీ
పార్టీ మార్పుపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు.
హైదరాబాద్: పార్టీ మార్పుపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు.
గురువారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో ఆయన మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నానని ఎవరు చెప్పారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ పార్టీ మారితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెబుతానని ఆయన స్పష్టం చేశారు.
తాను ఏది చెప్పాలనుకొంటే అది చెబుతానని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ మార్పు విషయమై నిర్ణయం తీసుకోలేదన్నారు. బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
గత వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ఉద్దేశ్యంతోనే ఈ విమర్శలు చేశారని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.