జర్నలిస్టులకు అండగా ఉంటాం.. బాలకృష్ణ
ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచానికి సెకన్ల వ్యవధిలో తెలియజేసేది జర్నలిస్టులు మాత్రమేనని అలాంటి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరముందన్నారు.
జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ..ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా..ఇళ్ల స్థలాల సాధన కోసం ఐదురోజులుగా వైరాలోని క్రాస్రోడ్డు వద్ద జర్నలిస్టులు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని రోడ్షోలో భాగంగా సోమవారం వైరా వచ్చిన బాలకృష్ణ సందర్శించారు.
కొద్దినిమిషాలు ఈ దీక్షా శిబిరంలో కూర్చోని.. జర్నలిస్టులు అందించిన వినతిపత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచానికి సెకన్ల వ్యవధిలో తెలియజేసేది జర్నలిస్టులు మాత్రమేనని అలాంటి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరముందన్నారు.
జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. సంఘీభావం తెలిపిన బాలకృష్ణకు, సహకరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావుకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.