హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తుక్కుగూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గుర్తు తెలియని దుండగుడు లారీ డ్రైవర్పై కాల్పులు జరిపారు.
హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తుక్కుగూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గుర్తు తెలియని దుండగుడు లారీ డ్రైవర్పై కాల్పులు జరిపారు. వివరాలు.. జార్ఖండ్కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి ఐరన్ లోడ్ లారీతో.. కేరళలోని కొచ్చి వైపు వెళ్తున్నాడు. అయితే లారీ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్దకు చేరుకున్నప్పుడు.. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో లారీ డ్రైవర్ వైపు కాల్పులు జరిపాడు. దీంతో ఓఆర్ఆర్ వద్ద భయాందోళనలు నెలకొన్నాయి.
అయితే ఈ కాల్పుల్లో లారీ డ్రైవర్కు ఎటువంటి గాయం కాలేదు. అయితే లారీ ముందు క్యాబిన్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పహాడీ షరీఫ్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. ఇక, కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు కారులో శంషాబాద్ వైపు పారిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఈ కాల్పుల ఘటన దోపిడి ప్రయత్నంలో భాగామా?, గతంలోని ఏమైనా గొడవలు కారణమా?, ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ‘‘రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే మేము ఘటన స్థలానికి చేరుకుని.. లారీని గుర్తించాం. లారీ డ్రైవర్ నుంచి ఫిర్యాదు తీసుకుంటున్నాం. అయితే నిందితుడిని గుర్తించాల్సి ఉంది’’ అని పోలీసులు తెలిపారు.
