ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా: కేసీఆర్పై ఢిల్లీ మైనారిటీ కమీషన్ ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ మైనారిటీ కమిషన్ అక్షింతలు వేసింది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదా... ప్రశ్నిస్తే వేటు వేస్తారా అంటూ మండిపడింది.
తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ మైనారిటీ కమిషన్ అక్షింతలు వేసింది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదా... ప్రశ్నిస్తే వేటు వేస్తారా అంటూ మండిపడింది.
వివరాల్లోకి వెళితే.. నాంపల్లిలోని ప్రభుత్వ ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా గత 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న లతీఫ్ మహ్మద్ ఖాన్.. కేసీఆర్పై యూట్యూబ్లో మండిపడ్డారు.
2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే.. 2018లో ఓట్లను అడుగుతారంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఒక వీడియోను రూపొందించి దానిని యూట్యూబ్, ఫేస్బుక్ ఖాతాల్లో అప్లోడ్ చేశారు.
ఎనిమిది నిమిషాల నిడివిగల ఈ వీడియోలో ముఖ్యమంత్రి కేసీఆర్పై లతీఫ్ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేయడం, మూడెకరాల భూమి హామీల వంటి వాటిని ప్రస్తావించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో ఈ విషయం ఆనోటా ఈనోటా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా అలా వీడియో పోస్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ ఆయన చర్య ఎన్నికల కోడ్ను ఉల్లంఘన కిందకు వస్తుందంటూ లతీఫ్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
దీంతో ఆయన ఢిల్లీ మైనారిటీ కమీషన్ను ఆశ్రయించడంతో... కమీషన్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. లతీఫ్ ఖాన్ 20 ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారని... ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారిపై చర్యలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
లతీఫ్ ఖాన్పై విధించిన సస్పెన్షన్ను తక్షణం ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ మైనారిటీ కమీషన్ ఛైర్మన్ జాపర్ ఉల్ ఇస్లాం ఖాన్ .. సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.