ఆ రూమర్స్ నమ్మకండి.. మేము రోజూ చికెన్ తింటున్నాం... మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రిగారింట్లో ఎవరూ అనారోగ్యంబారిన పడలేదు. మరి మీకెందుకు దిగులు? చికెన్వల్ల కరోనా వ్యాధి వ్యాపిస్తుందన్నది శుద్ధ అబద్ధం’ అని ఆయన పేర్కొన్నారు.
తాము రోజూ చికెన్ తింటున్నామని.. అయినా తమకు ఎలాంటి అనారోగ్యం రాలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికెన్, కోడిగుడ్లు తినకూడదని.. వాటికి కూడా వైరస్ లు సోకాయంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది.
వాటిని నిజమని నమ్ముతున్న తెలంగాణ ప్రజలు చికెన్ తినడం తగ్గించేశారు. దీంతో పౌల్ట్రీ బిజినెస్ దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలో.. దీనిపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించారు.
‘నేను ముఖ్యమంత్రిగారి ఇంట్లోనే ఉంటు న్నా. మా ఇంట్లో పిల్లలతోసహా మేమంతా ప్రతిరోజు చికెన్, గుడ్లు తింటున్నాం. ముఖ్యమంత్రిగారింట్లో ఎవరూ అనారోగ్యంబారిన పడలేదు. మరి మీకెందుకు దిగులు? చికెన్వల్ల కరోనా వ్యాధి వ్యాపిస్తుందన్నది శుద్ధ అబద్ధం’ అని ఆయన పేర్కొన్నారు.
చికెన్,కోడిగుడ్లపై జరుగుతున్న దుష్ప్రచారాని నమ్మవద్దని, వాటి వల్ల ఎవరికీ ఎలాంటి అనారోగ్యం కలగలేదని ఆయన వివరించారు. ఆలిండియా పౌల్ట్రీ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసొసియేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ప్లాజాలో చికెన్, ఎగ్ మేళాను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అందరి ముందే వారు స్వయంగా చికెన్, కోడిగడ్లు ఆరగించారు. చికెన్,కోడిగుడ్లు చౌకగా లభిస్తున్నాయని.. వాటితో మనకు పౌష్టికాహారం లభిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు చికెన్ తిని ఆరోగ్యానికి ఎవరూ గురికాలేదని.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.