త్వరలో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి. తనకు జరిగిన అవమానంతోనే కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు.  

త్వరలో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి. ఆదివారం ఆయన ఇంటికి మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు వెళ్లి నాగంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగం జనార్థన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం నాగం మీడియాతో మాట్లాడుతూ.. తనకు జరిగిన అవమానంతోనే కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి బీఆర్ఎస్‌లో చేరుతానని నాగం జనార్థన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు. 

కాగా.. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టును నాగం జనార్ధన్ రెడ్డి ఆశించారు. కానీ ఈ స్థానం నుండి నాగం జనార్థన్ రెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ కు ఇవాళ రాజీనామా చేశారు. తన అనుచరులతో రెండు మూడు దఫాలు సమావేశమైన ఆయన బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

ALso Read: కాంగ్రెస్ కు షాక్: రాజీనామా చేసిన నాగం జనార్థన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి

నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు టీడీపీ అభ్యర్ధిగా, ఒక్కసారి ఇండిపెండెంట్ గా నాగం జనార్థన్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈసారి నాగర్ కర్నూల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని భావించారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం నాగం జనార్ధన్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించలేదు. 

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో రాజేష్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. నాగర్ కర్నూల్ టిక్కెట్టు తనకు దక్కకుండా జూపల్లి కృష్ణారావు అడ్డుకున్నారని నాగం జనార్ధన్ రెడ్డి రగిలిపోతున్నారు. సర్వే రిపోర్టులను మార్చి తనకు టిక్కెట్టు దక్కకుండా చేశారని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నాగంకే టిక్కెట్టు కేటాయించాలని ఆయన అనుచరులు రెండు వారాల క్రితం గాంధీభవన్ లో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.