Balagam Mogilaiah: బ‌లగం మొగిల‌య్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. మొగిల‌య్య ఆరోగ్యంపై రాష్ట్ర మంత్రి హ‌రీశ్‌రావు స్పందించారు. ఆయ‌న‌కు మెరుగైన వైద్యం అందిస్తామ‌ని చెప్పారు.  

Balagam Mogilaia: తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమా బ‌లగం. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే తోడుగా మాతో ఉండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొమురయ్యా అంటూ సాగే ఆ పాట కోట్లాది మంది హృదయాలను ద్రవింపజేసింది. అయితే .. ఇటీవల ఈ పాటను ఆలపించిన మొగిల‌య్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఆయన గ‌త కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ వ‌రంగ‌ల్‌లోని సంర‌క్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో మొగిలయ్యకు వైద్యులు డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. మొగిల‌య్య ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.దీంతో మెరుగైన వైద్యం కోసం మొగిలయ్యను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న ఆయనకు ఇప్పటికే రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి.

ఈ క్రమంలో మొగిల‌య్య ఆరోగ్యంపై మంత్రులు హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్పందించారు. ఆయ‌న‌కు మెరుగైన వైద్యం అందిస్తామ‌ని చెప్పారు. అంతకు ముందు మొగిల‌య్య‌ను వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని సంబంధిత అధికారుల‌ను మంత్రులు ఆదేశించారు. ఆయనకు కావాల్సిన పూర్తి వైద్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

బలగం సినిమా క్లైమాక్స్‌లో.. మరుగున పడ్డ మానవ సంబంధాలను తట్టి లేపుతూ.. మొగిలయ్య దంపతులు పాడిన పాట నిజంగా ఓ అద్బుతం. తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొమురయ్యా అంటూ సాగే ఆ పాట..ప్రతి ఒక్కరితో కన్నీరు తెప్పిస్తుంది. గుండెను పడేస్తుంది. యెద లోతుల్లోని తడిని తట్టిలేపి.. కంట నీరు తెప్పిస్తుంది.ఈ ఘనత సింగర్ మొగిలయ్య, కొమురమ్మ దంపతులదే.