వినాయక నిమజ్జనానికి సర్వం సిద్దం... పాతబస్తీలో పరిస్థితిని పరిశీలించిన మంత్రి తలసాని (వీడియో)
హైదరాబాద్ లో భారీ ఎత్తున వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్న నేపథ్యంలో ఊరేగింపు కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్:గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం నగరంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో మేయర్ పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మితో కలిసి మంత్రి తలసాని చార్మినార్, మొజం జాహీ మార్కెట్ల వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.
వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకూ ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఎంతో వైభవంగా జరిగే వినాయక నిమజ్జనాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
read more హైద్రాబాద్లో గణేష్ నిమజ్జనం: ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయక శోభాయాత్ర
''జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 40 వేల వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం జరిగింది. వీటిలో కొన్నింటిని 3, 5, 7, 9వ రోజుల్లో నిమజ్జనం చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది'' అని మంత్రి వెల్లడించారు.
వీడియో
''దేశంలోనే అతి పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశాం. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ శోభాయాత్ర కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకోసమే ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశాం. కాబట్టి భక్తులు, ప్రజలు నిమజ్జన ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలి'' అని మంత్రి తలసాని సూచించారు.