ఏపీ మంత్రులతో చర్చిస్తాం.. సినీ పరిశ్రమపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని ప్రకటించారు. ఇండస్ట్రీ అభివృద్ది కోసం చేయూతనిస్తామని, ఇటీవల ఐదో ఆటకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని వెల్లడించారు తలసాని.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు సినీపరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించారు. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని.. తెలంగాణలో టికెట్ ధరలు పెంచామనీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా మార్చాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. సినిమాకు కులం, మతం, ప్రాంతాలు ఉండవనీ, సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమేనని తలసాని స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని, నిర్ణయాలు తీసుకోదని అన్నారు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
టాలీవుడ్ పై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారని.. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీలో థియేటర్ల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ఈ సమస్యపై ఏపీ సర్కార్ తో చర్చించిన చర్చలు విఫలయత్నాలుగానే మిగిలాయి. ఇటీవల సినిమా టికెట్ రేట్ల విషయంపై ఆర్జీవీ కూడా పేర్ని నానితో భేటీ అయ్యారు. ఆ మీటింగ్ లో కూడా తేలిందేమీ లేదు. మరోవైపు ప్రభుత్వం వేసిన కమిటీ ఇచ్చే నివేదికపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తలసాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి ఏపీ మంత్రులతో తలసాని చర్చలు ఎప్పుడు జరుగుతాయి ? అనేది చూడాలి.