గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని మహిళలు గర్వించే విధంగా గతంలో శంషాబాద్ లోని చటాన్ పల్లి లో దిశ ఘటన మాదిరిగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల కోసం షి టీమ్స్ లను ఏర్పాటు చేసి వారి భద్రతకు పెద్ద పీట వేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు మహిళలపై హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తక్షణం స్పందించారు. మంగళవారం గాంధీ ఆసుపత్రికి వచ్చిన ఆయన అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అత్యాచారం జరిపిన వారిపై కఠినంగా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో మహిళల భద్రత కు ఎన్నో చర్యలు చేపట్టామని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. దేశంలోని మహిళలు గర్వించే విధంగా గతంలో శంషాబాద్ లోని చటాన్ పల్లి లో దిశ ఘటన మాదిరిగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
Also Read:గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం: బాధితురాలి ఫిర్యాదు కాపీలో ఏముందంటే..?
ఇప్పటికే రాష్ట్రంలో మహిళల కోసం షి టీమ్స్ లను ఏర్పాటు చేసి వారి భద్రతకు పెద్ద పీట వేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో మహిళల పట్ల ఎన్నో దారుణమైన సంఘటన లు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఏ ఒక్క మహిళపై అత్యాచారం కానీ అవమానించేలా మాట్లాడినా కఠినంగా శిక్షించాలని, అందుకు చట్టంలో మార్పులు తేవాలన్నారు శ్రీనివాస్ గౌడ్.