ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) దేశంలో పలు రాజకీయ పార్టీల కోసం పనిచేస్తుంది. తెలంగాణలో కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్తో కలిసి ఐ ప్యాక్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్: ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యుహాకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతనికి అనుబంధంగా ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) దేశంలో పలు రాజకీయ పార్టీల కోసం పనిచేస్తుంది. గత ఏడాది ఆరంభం నుంచి తెలంగాణలో బీఆర్ఎస్తో ఐ ప్యాక్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది ఏప్రిల్లో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చి కేసీఆర్, కేటీఆర్లతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఐ ప్యాక్ టీమ్స్ కూడా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కోసం సర్వేలు నిర్వహించాయి. ఆ నివేదికలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు అందజేశాయి. తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్తో కలిసి ఐ ప్యాక్ కలిసి పనిచేయనుందని కూడా అంతా భావించారు.
అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్తో ఐ ప్యాక్ కలిసి పనిచేయడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) బీఆర్ఎస్తో కలిసి పనిచేయడం లేదని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్తో ఐ ప్యాక్ ఒప్పందాన్ని ముగించుకున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.
ఇక, ఐ ప్యాక్ టీమ్ చివరిగా గతేడాది నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్తో కలిసి పనిచేసింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ తన సొంత టీమ్తో ఐటీ వింగ్, సోషల్ మీడియాప్రచారాన్ని నిర్వహిస్తోంది. అయితే బీఆర్ఎస్- ఐ ప్యాక్ల మధ్య ఒప్పందం ముగియడానికి గల కారణాలు మాత్రం వెల్లడికాలేదు. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ కిషోర్ బీహార్లో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ప్రస్తుతం తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.
